బీజింగ్, ఫిబ్రవరి 24 : పొరుగు దేశం చైనా భారత్ ను ఎదో రకంగా ఇబ్బంది పెట్టాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఒక వైపు మన దేశం సన్నిహితంగా ఉన్న దేశాలతో స్నేహబంధం అంటూ మనల్ని లక్ష్యంగా చేసుకొని డ్రాగన్ దేశం కుయక్తి బుద్ధి చూపిస్తుంది. కాగా ఈ సారి ఆధునికంగా మనపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా తరహాలో ఉండే ‘సమగ్ర వ్యక్తిగత సైనిక పోరాట వ్యవస్థ’గా పిలిచే భవిష్యత్తు ‘ఇన్ఫర్మేటైజ్డ్ వార్ఫేర్’ను సైన్యంలో ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థతో శిక్షణనిచ్చిన సైన్యంలోని ఒక శాఖను భారత సరహద్దు వెంట రక్షణగా పెట్టింది.
'ఇన్ఫర్మేటైజ్డ్ వార్ఫేర్' అంటే యుద్ధ పరిస్థితుల్లో సమాచార సాంకేతికత, డిజిటల్, కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడం. చైనా సైన్యంలో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టే వెస్ట్రన్ థియేటర్ కమాండ్లోని ‘ది స్కై వూల్ఫ్ కమాండో’స్కు ‘క్యూటీఎస్-11’ వ్యవస్థను అందించింది. ‘క్యూటీఎస్ - 11’ వ్యవస్థ అచ్చం అమెరికా సైనికులు వాడే వ్యవస్థతోనే పోలి ఉంటుందని చైనా నిపుణులు చెబుతున్నారు.