న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ. 11. 400 కోట్ల మేర టోకర వేసిన ప్రముఖ నగల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.హెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు.
ఇంతా దారుణంగా బ్యాంక్ ను మోసం చేసిన అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండటంలో ఆర్ బీఐ గవర్నరు ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులపై పర్యవేక్షణ ఏ మేరకు ఉందొ తెలియడానికి ఈ ఉదంతం ప్రత్యక్ష నిదర్శనమని, ఆర్బీఐ నిర్లక్ష్యం, వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.