పాకిస్థాన్, ఫిబ్రవరి 26 : భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించాలి. ఏ క్షణం తుపాకీ శబ్దం మోగుతుందో, ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో అర్ధంకాదు. ప్రస్తుతం ఉరి సెక్టార్లో భయానక వాతావరణం కొనసాగుతుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఇరు పక్షాలు పరస్పరం శతఘ్నలను ఉపయోగించి దాడులుచేసుకున్నాయి. 2003లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైన్యాలు శతఘ్నుల వినియోగాన్ని ఆపేశాయి. కానీ గత సోమవారం ఉరి సెక్టార్లోని హాజీపీర్లో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి.
శనివారం పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఇరు దేశాలు భారీ శతఘ్నులను రంగంలోకి దించాయి. దీంతో అక్కడ నివసించే దాదాపు 8000 మంది ప్రజలు భయం గుప్పిట బ్రతుకుతున్నారు. దీంతో ఉరి సెక్టార్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.