విజయవాడ, ఫిబ్రవరి 27 : వెండితెరను శాసించిన అతిలోక సుందరి అకాల మరణం పట్ల అటు సినీ రంగ, రాజకీయ రంగ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. "శ్రీదేవి మృతి చెందడం విని షాకింగ్ కి గురయ్యాను. ఆమె మృతికి కారణాలు, నిజానిజాలు తెలియాల్సి ఉంది. తప్పుడు ఊహాగానాలతో సమాచారాన్ని సృష్టించడం సరికాదు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదు. ఆమెకు ఖచ్చితంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి శ్రీదేవి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి" అంటూ పేర్కొన్నారు.