హైదరాబాద్, మార్చి 4 : మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ "షీటీమ్స్" ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 10 కె రన్ ను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరం మొత్తంలో 24 గంటల పాటు 100 షీ టీంలు మహిళల భద్రత కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయని అభినందించారు. "నగరాల్లో మహిళల భద్రతలో హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయ౦" అంటూ వ్యాఖ్యానించారు.
కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు. మహిళల భద్రతకు భరోసా లభిస్తుందన్నారు. ఈ 10 కె రన్ లో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సినీ నటుడు విజయ్ దేవరకొండ, సీపీ శ్రీనివాస్ రావు, అడిషనల్ సీపీ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. అనంతరం హీరో విజయ్ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పోలీసులు చేస్తున్న కృషి గొప్పదన్నారు. షీ టీమ్స్ వల్ల మహిళలు రాత్రిళ్లు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి పోయిందని పీవీ సింధు పేర్కొన్నారు.