చెన్నై, మార్చి 7 : నటనకి భాష అక్కర్లేదు.. కేవలం భావం ఉంటే చాలు అన్నట్లుగా ఉంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ "మెర్క్యూరీ" అనే మూకీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎలాంటి మాటలు లేకుండా కేవలం భయపడుతున్న హావభావాలతోనే ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ కథానాయకులు దగ్గుబాటి రానా, ధనుశ్, నివిన్ పాలిన్, రక్షిత్ శెట్టి ట్విటర్ ద్వారా విడుదల చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. అలాగే బ్యాగ్రౌండ్ లో వచ్చే సౌండ్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.