జెనీవా, మార్చి 11 : భారత్ ను ధైర్యంగా ఎదుర్కొలేని పాకిస్తాన్ ఐక్య రాజ్య సమితిలో బూటకపు ఆరోపణలు చేసింది. ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత సహాయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ..భారత ప్రభుత్వం కశ్మీర్ను ఆక్రమించుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు భారత్ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ ఒక ‘విఫల దేశం’అనీ, దాని నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తాజాగా పాక్ ఆరోపణలపై ఐరాసలో భారత సహాయ కార్యదర్శి మినీదేవి కుమమ్ మాట్లాడుతూ.. "పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు స్వర్గధామం. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన అంటూ పాఠాలు చెప్పే ముందు పాక్ ముంబై, పఠాన్కోట్, ఉదీ దాడులకు కారకులను గుర్తించి, శిక్షించాలి. ప్రపంచాన్ని తమ క్రూర చర్యలతో భయపెట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి ఎంతో మందికి పాక్ ఆశ్రయం కల్పించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అసలైన మానవహక్కుల ఉల్లంఘన" అని వ్యాఖ్యానించారు.