న్యూఢిల్లీ, మార్చి 11 : ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా సౌరవిప్లవం రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఇందుకోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సౌరకూటమి వ్యవస్థాపక సదస్సులో అభిప్రాయపడ్డారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ఇప్పటివరకు సాధించిన పురోగతిని సదస్సుకు హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ సహా 23 దేశాల అధినేతలకు మోదీ వివరించారు. గత మూడేళ్లలో 28 కోట్ల ఎల్ఈడీ బల్బులు అమర్చడం ద్వారా 4 గిగావాట్ల విద్యుత్, 200 కోట్ల డాలర్ల సొమ్ము ఆదా చేసినట్లు వెల్లడించారు.
2022 నాటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారత్ 175 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలదని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. సౌరవిప్లవ సాధన కోసం ప్రపంచ దేశాలకు భారత్ తనవంతు తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు.