న్యూడిల్లీ, మార్చి 13: కనీస వేతనాలను చెల్లించాలని, జాతీయ పింఛన్ పథకం (ఎన్పీఎస్)ను ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ రైల్వే సిబ్బంది మంగళవారం పార్లమెంట్ వద్ద ప్రదర్శన నిర్వహించనున్నారు. విశ్రాంత ప్రభుత్వోద్యోగుల సామాజిక భద్రతను 2004లో ఎన్పీఎస్తో కోల్పోయినట్లయిందని ‘అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య’ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్ర ఆరోపించారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి పింఛన్ భరోసా లేదని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. దీనికి నిరసనగా పార్లమెంటు వద్ద చేపట్టనున్న ప్రదర్శనకు అధిక సంఖ్యలో ఉద్యోగులు హాజరవుతారని పేర్కొన్నారు.