అమరావతి, మార్చి 14 : బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహా౦ వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. "మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వైసీపీ ఎంపీలకు ఇవ్వడం ఏంటి.? భాజాపాకు మిత్రపక్షం టీడీపీనా.? లేదంటే వైసీపీనా".? అంటూ నిలదీశారు.
ఈ మేరకు పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కేంద్ర౦ వైఖరి రాష్ట్ర ప్రజలను ఆవేదనకు గురి చేస్తోందన్నారు. దశలవారీగా పోరాటం మరింత ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు. జిల్లా స్థాయిలో పోరాడాలని, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుపై ఢిల్లీ వేదికగా ప్రశ్నించాలన్నారు. జాతీయ పార్టీల నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభకు ఎవరూ గైర్హాజరు కాకుండా సభల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించేలా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.