న్యూఢిల్లీ, మార్చి 14 : పార్లమెంటు ఉభయసభలు నిరసన హోరుతో మారుమ్రోగిపోయాయి. సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీల సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై తెదేపాకు తోడు వివిధ సమస్యలపై పలు పార్టీలు ఆందోళన చేయడంతో లోక్సభ బుధవారం దద్దరిల్లింది.
మరోవైపు విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం పలు బిల్లులను ఆమోదింపజేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లు, సవరణలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.
అటు రాజ్యసభలోనూ ఆందోళనల పర్వం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. అనంతరం సభ్యులు ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.