అమరావతి, మార్చి 16 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ నేతలు రక్షణ బడ్జెట్ కూడా ఇవ్వమని అడుగుతారని కేంద్ర మంత్రులు హేళన చేశారు. రక్షణ బడ్జెట్ నిధులు అడిగేందుకు మాకు సంస్కారం లేదనుకుంటున్నారా.? అంటూ నిలదీశారు.
అంతేకాకుండా "మీ ఒక్కరికే దేశభక్తి ఉందా, మాకు లేదా? మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా.? ప్రత్యేక హోదా వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. కాని ఇచ్చిన మాటను కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లు ప్రధాని మోదీ అని ఆయనకు గౌరవమిస్తూ వస్తుంటే ఆయన మాత్రం అందరిని మా మీదకు ఉసిగొల్పుతున్నారని ఎద్దేవా చేశారు.