అమరావతి, మార్చి 17 : గుంటూరు దుర్ఘటన శాఖాపరమైన వైఫల్యమని మున్సిపల్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకరి వైఫల్యం పదిమంది మృతికి కారణం కావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
"ఏదైనా విపత్తు వస్తే దానిని చక్కదిద్దేలా వరకు వదిలిపెట్టకూడదు. విశాఖలో 'హుద్హుద్' వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాం.? ఆ స్ఫూర్తి ఇప్పుడు గుంటూరులో ఏమైంది" అంటూ ప్రశ్నించారు. స్థానికంగా వైఫల్యం చెందితే ఉన్నతస్థాయి యంత్రాంగం చక్కదిద్దకుండా ఏం చేస్తోంది.? అధికార యంత్రాంగం పనితీరు ప్రభుత్వ గౌరవం పెంచేలా ఉండాలి కాని తప్పు జరగకూడదన్నారు.
ఒకవేళ అదే జరిగితే సకాలంలో సరిదిద్దాలని హితవు పలికారు. పైపులైన్ల లీకేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. మురుగు కాలువలన్నీ శుభ్రపరచాలని ఆదేశించారు. పాత పైపులైన్లు తొలగించి కొత్త లైన్లు వేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.