అమరావతి, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం చేపట్టారు. ఇప్పటికైనా విభజన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని 'ప్రత్యేక హోదా సాధన సమితి' నేతలు హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు సంజీవని లాంటిదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. జాతీయ రహదారులపై వాహనాలను అడ్డుకుని నిరసన తెలుపుతూ.. ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెదేపాతో పాటు, వైకాపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.