భద్రాచలం, మార్చి 25: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం మూలవిరాట్కు అభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. రేపు శ్రీరామ నవమి సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ పరిసరప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. కల్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేసేందుకు ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటుచేశారు.