మెదక్, మార్చి 30: ఓ వివాహిత గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన మల్లేశం, రుక్కుంబాయిల కూతురు హేమలత(24)కు 2013 మేలో మెదక్ పట్టణంలోని కుమ్మరిగడ్డకు చెందిన పులుగం సతీష్తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
ఈ ఏడాది జనవరిలో భర్త సతీష్తో గొడవపడిన హేమలత ఇంట్లోంచి వెళ్లిపోయి హైదరాబాద్ బోయిన్పల్లిలో ఉంటున్న తల్లిగారింటికి చేరుకుంది. అప్పటి నుండి తిరిగి మెదక్కు రాలేదు. నాలుగేళ్ల కొడుకు అనిరుధ్ను తండ్రి వద్దనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గురువారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలో కాలిపోయి శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ చందన దీప్తి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ భాస్కర్లు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.