హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) నుంచి కొత్తగా ఆవిర్భవించనున్న రాజకీయ పార్టీ పేరును కోదండరాం ఎట్టకేలకు ప్రకటించారు. తెలంగాణ జనసమితి పేరిట పార్టీని ఏర్పాటుచేస్తున్నట్టు సోమవారం అధికారికంగా తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు.
టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా కీలక అడుగులు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తామని ఆయన గతంలో చెప్పారు. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు.. పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్లో ఉంటుందని తాజాగా వెల్లడించారు.