తాడిపత్రి, ఏప్రిల్ 12: వైఎస్సార్ సీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లా తాడిప్రత్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.