న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : జమిలి ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని న్యాయకమిషన్ ముసాయిదా పత్రంలో సూచించింది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరపాలన్న కేంద్రప్రభుత్వం భావిస్తున్న తరుణంలో న్యాయకమిషన్ అంతర్గత కసరత్తు పత్రం (వర్కింగ్ పేపర్).. ఒక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. 2019 సాధారణ ఎన్నికలప్పుడు కొన్ని రాష్ట్రాలకు.. 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
ఆ రెండు సంవత్సరాల సాధారణ ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల శాసనసభల గడువును అవసరాన్ని బట్టి కుదించడమో, పెంచడమో చేయాలనీ చెప్పింది.దీనికోసం రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాలనీ సూచనలు చేసింది. ఈ కసరత్తు పత్రాన్ని పూర్తి కమిషన్.. ఈ నెల 17న చర్చించనుంది. సభ్యులు ఈ ముసాయిదా పత్రంలో ఎటువంటి మార్పులును సూచిస్తే తుది నివేదిక రూపొందించేముందు వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత తుది నివేదికను న్యాయమంత్రిత్వశాఖకు అప్పగిస్తారు.