హైకోర్టు కోర్టు ఆదేశాల మేరకే జడ్జి ఇంట్లో సోదాలు..

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 12:18 PM

హైకోర్టు కోర్టు ఆదేశాల మేరకే జడ్జి ఇంట్లో సోదాలు..

హైదరాబాద్, ఏప్రిల్ 13: హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ 1వ అడిషనల్ మెట్రో పాలిటన్ జడ్జి రాధాకృష్ణమూర్తి ఇంట్లో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణ కుమార్ తెలిపారు. ఓ డ్రగ్స్ కేసు నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు రూ. 7.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గత అర్ధరాత్రి నుంచి అల్వాల్‌లోని జడ్జి రాధాకృష్ణమూర్తి ఇంటితోపాటు మరో రెండుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఆయన డబ్బు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ.

డబ్బిచ్చి తాను బెయిల్ తెచ్చుకున్నానని బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, హైకోర్టు దీన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి, రాధాకృష్ణమూర్తిపై కేసు నమోదు చేశారు. ఆపై ఆల్వాల్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు చేసి బ్యాంక్ లాకర్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

గత సంవత్సరం ఓ నైజీరియన్ తో కలసి దత్తు అనే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ ఇచ్చేందుకు రూ. 11 లక్షలను రాధాకృష్ణ మూర్తి డిమాండ్ చేశారని, చివరకు రూ. 7.5 లక్షలకు బేరం కుదిరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఈ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చాయని, ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపైనా సోదాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.





Untitled Document
Advertisements