జమ్మూ-కాశ్మీర్, ఏప్రిల్ 13 : సభ్యసమాజం తలదించుకోనేల... మానవత్వం సిగ్గుపడేలా... యావత్ భారత్ దేశం నివ్వెరపోయేలా.. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల అసిఫా అనే బాలికను అపహరించి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి అతి కిరాతంగా అంతమొందించారు. వర్గ పోరులో అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై మృగాల మాదిరి ప్రవర్తించి చంపేశారు.
ఈ దారుణమైన ఘటన జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకుంది. గోవధ చేశారని, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని, దానివల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని భావించిన ఒక వర్గం ఇందుకు కారణమైన బకర్వాల్ ముస్లిములను ఊళ్లోంచి తరిమేయాలని నిర్ణయించారు. ఆ వర్గానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని 4 రోజులపాటు గుడిలో బంధించి ఒకరి తర్వాత మరొకరుగా నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కర్రతో కొట్టి అతి దారుణంగా ఆమెను చంపేశారు. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లా హీరానగర్ తహసీల్ పరిధిలోని రస్సానాలో జనవరి 10న జరిగిన ఘోరమిది. ఈ ఘటనలో రిటైర్డ్ రెవెన్యూ అధికారి సాంజీ రామ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అతని మేనల్లుడు, కొడుకు, మేనల్లుడి స్నేహితుడు, ఓ ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను నిందితులుగా చార్జిషీటులో పేర్కొన్నారు.
బకర్వాల్ ముస్లిముల గుర్రాలను పొలాల్లో మేపనివ్వవద్దని తమ వర్గం వారిని సాంజీరామ్ రెచ్చగొట్టాడు. వాళ్లకు భూములు విక్రయించకుండా అడ్డుకున్నాడు. ఈ ఘటనతో జమ్ము, కశ్మీరు ఇప్పుడు మత ప్రాతిపదికన విడిపోయాయి. హిందూ ఆధిపత్య జమ్మూ ప్రాంతం, ముస్లిం ప్రాబల్య కశ్మీరు ప్రాంతం రగిలిపోతున్నాయి.
నాలుగు రోజులపాటు ఒకరి తర్వాత మరొకరు అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత జనవరి 14న సాంజీ మేనల్లుడు ఆమెను దుడ్డు కర్రతో తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆమె మృతదేహాన్ని గుడికి సమీపంలోని అడవుల్లో పడేశారు. ఈ ఘాతుకాన్ని కప్పిపుచ్చేందుకు సాంజీ రామ్ స్థానిక పోలీసులకు రూ.3 లక్షలు లంచం ఇచ్చాడు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులనూ అరెస్టు చేశారు. ఈనెల 16న స్థానిక న్యాయస్థానం ఈ కేసును విచారించనుంది.