హైదరాబాద్, ఏప్రిల్ 13 : సన్ రైజర్స్ తరుపున ఆడుతున్న రషీద్ ఖాన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియాన్స్ మధ్య జరిగిన రసవత్తర పోరులో హైదరాబాద్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో రైజర్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసిన రషీద్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన అతనికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
రషీద్ వేసిన నాలుగు ఓవర్లలో అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేశాడు. అంటే ఏకంగా మూడు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన మూడో క్రికెటర్గా రషీద్ తన పేరును లిఖించుకున్నాడు. గతంలో రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలు అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేశారు.