హైదరాబాద్, ఏప్రిల్ 14 : రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "రంగస్థలం" చిత్రం బ్లాక్బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని నిర్వహించింది. ఈ వేదికకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రంగస్థలం మన తెలుగు నేల కథ. మన మట్టి కథ. ఇలాంటి చిత్రాలు వచ్చినప్పుడు వాటిని ప్రోత్సహించాలి. హాలీవుడ్లో వచ్చిన అత్తుత్యమ చిత్రాలకంటే 'రంగస్థలం'కి మంచి రేటింగులు వచ్చాయి. ఇలాంటి చిత్రాల వల్ల భావితరాలకు విలువల గురించి, వాస్తవికత గురించీ అర్థమవుతుంది. మరిన్ని మంచి చిత్రాలు రావడానికి స్ఫూర్తి ఇస్తుంది.
ఒక పల్లెటూరి వాతావరణంలో సినిమా చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు.. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని బలంగా కోరుకునేవాడిని అన్నారు. అలాగే నాక్కూడా కొన్ని పాత్రలు చేయాలనిపిస్తుంది. కానీ చేయలేను అన్నారు. పంచెకట్టుకుని సినిమా చేసేంత ధైర్యం నాకు లేదు. అలాంటి పాత్రలో చరణ్ కనిపించినందుకు ఆనందంగా ఉంది. చరణ్ నాకు తమ్ముడిలాంటివాడు. తను మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు.
అలాగే రామ్చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక అమ్మానాన్నల స్పందన మర్చిపోలేను. కల్యాణ్ బాబాయ్ ఇంటికివెళ్లి సినిమా చూడామని చెబుదామనుకున్నా. కానీ ఆయనే ఇంటికి పిలిచి అభినందించారు. జనాల మధ్యన కూర్చుని సినిమా చూడాలని ఉందన్నారు. 'తొలి ప్రేమ' తర్వాత నా సినిమానే థియేటర్లో చూసినందుకు చాలా సంతోషంగా అనిపించిందన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ఇంతటి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కృషి వెనకాల చాలా మంది కష్టం దాగి ఉంది. చాలా మంది నటీనటులు సాంకేతికత నిపుణులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వారందరి కృషి వల్లే ఇంత మంచి సినిమాను అందివ్వగాలిగాన౦టూ తెలిపారు.