విజయవాడ, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తన పుట్టిన రోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అంటే ఏంటో కేంద్రానికే కాదు.. మొత్తం దేశానికి తెలిసే విధంగా చూపిస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పా... భవిష్యత్తులో మళ్లీ చక్రం తిప్పబోతున్నామని స్పష్టం చేశారు.
‘‘రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈనెల 20న నా పుట్టినరోజు..సాయంత్రం వరకు దీక్ష చేస్తా. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కేంద్రం లాలూచీ, ముసుగు రాజకీయాలు చేస్తోంది. నన్ను విమర్శించే అర్హత బీజేపీ, వైసీపీకి లేదు. కొత్త వచ్చిన ఓ పార్టీ కూడా మాపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనే బంద్కు పిలుపునిచ్చారు. అభివృద్ధికి విఘాతం కల్గకుండా శాంతియుతంగా నిరసనలు చేద్దాం. కేంద్రంపై రాజీలేని పోరాటానికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.