హైదరాబాద్, ఏప్రిల్ 14 : ఐపీఎల్ లో ఎన్నో జట్లు ఆటగాళ్లు మారారు. ఈ 11వ సీజన్ కు కొంత మంది వచ్చారు. మరికొంత మంది వెళ్లారు. చాలా మంది యువఆటగాళ్ల ఈ మెగా టోర్నీ జీవితాలను మార్చేసింది. యువరాజ్, ధోనీ, రైనా, రోహిత్ శర్మ, ఆరోన్ ఫించ్, పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్ వంటి ఎంతో మంది స్టార్లు ఫ్రాంచైజీలు మారిపోయారు. కానీ ఇప్పటి వరకూ మారకుండా ఒక ఆటగాడు ఒకే జట్టుకు ఆడుతున్నాడు. అతనెవరో కాదు..! పరుగుల వీరుడు విరాట్ కోహ్లి.
2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పట్నుంచి కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్నాడు కోహ్లీ. తన అపూర్వమైన బ్యాటింగ్తో ఆ జట్టుకు తిరుగులేని విజయాలు సాధించి పెట్టాడు. తొలి వేలంలో అతడిని బెంగళూరు దక్కించుకుంది. డేనియల్ వెటోరీ నుంచి బెంగళూరు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016 సీజన్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లు అజరామరం. ఐపీఎల్ ఉన్నంత కాలం అతడి వీరోచిత బ్యాటింగ్ను అందరూ గుర్తు చేసుకుంటారు.
2016లో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్లు ఆడి 973 పరుగులు సాధించాడు. నాలుగు శతకాలు బాదేశాడు. అతడి కళాత్మక విధ్వంసాలను చూసి భయపడని జట్టు లేదంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఎలాగైనా బెంగళూరును ట్రోఫీని దక్కించుకోవాలని తొలి సారి టైటిల్ ముద్దాడాలని కోహ్లి జట్టు భావిస్తుంది.