రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 11:44 AM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

కదిరి, ఏప్రిల్ 15 విధి నిర్వహణ కోసం ద్విచక్రవాహనంలో వెళుతుండగా కంటైనర్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కదిరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. మృతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గ్రామానికి చెందిన గణేష్‌ (24), తెలంగాణలోని వరంగల్‌ జిల్లా దుర్గండి మండలం వెంకటాపురానికి చెందిన హరీష్‌ (24) కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన చంద్రశేఖర్‌ (25) గా గుర్తించారు.

నల్లచెరువు మండలం జోగన్నపేట వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను ‘కృషి ఇన్ఫోటెక్‌’ చేపడుతోంది. ఈ ముగ్గురూ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం కదిరి పట్టణంలోని హోటల్‌లో భోజనం చేసి పని ప్రదేశాల వద్దకు వెళ్లేందుకు ముగ్గురు ద్విచక్రవాహనం పై బయలుదేరారు. కదిరి – మదనపల్లి మార్గంలో వేదవ్యాస్‌ స్కూల్‌వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణేష్, హరీష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చంద్రశేఖర్‌ను పోలీస్‌ వాహనంలో కదిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ గోరంట్లమాధవ్, తహసీల్దార్‌ పీవీ రమణ పరిశీలించారు.





Untitled Document
Advertisements