బెంగళూరు, ఏప్రిల్ 16 : సొంత గడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజు శాంసన్ (92 నాటౌట్: 45 బంతుల్లో 2×4, 10×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు సంజు శాంసన్ విధ్వంసక ఇన్నింగ్స్, కెప్టెన్ రహానే (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
ముఖ్యంగా శాంసన్ తనలోని విధ్వంసక కోణాన్ని ప్రత్యర్ధి జట్టుకు రుచి చూపించాడు. శక్తిని, టైమింగ్ను కలగలిపి బెంగళూరు జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఛేదనకు దిగిన బెంగుళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (57) మన్దీప్ సింగ్ (47), వాషింగ్టన్ సుందర్ (35) మినహా మిగతావారు విఫలమవడంతో బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓటమి పాలైంది. అసమాన ఇన్నింగ్స్ తో అదరగొట్టిన సంజు శాంసన్ కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.