బెంగళూరు, ఏప్రిల్ 16 : కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల సమరంకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు తమ పార్టీ అభ్యర్థులందరి పేర్లను ప్రకటించగా.. తాజాగా అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 82 మంది అభ్యర్థులతో విడుదల చేసిన రెండో జాబితాలో గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్రెడ్డికి బళ్లారి సిటీ టికెట్ కేటాయించింది.బళ్లారి ప్రాంతంలో గాలి కుటుంబానికి అక్కడి ప్రజల్లో మద్దతు ఉంది. సోమశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో బీజేపీకి ఓట్ల పరంగా ప్రయోజనం చేకూరడంతో పాటు.. రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే సోమశేఖర్ రెడ్డికి టికెట్ పొందడం వెనుక గాలి జనార్థన్ రెడ్డి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో బళ్లారి టికెట్ను గాలి కుటుంబానికి కేటాయించడంతో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.