మొహాలి, ఏప్రిల్ 17 : 'యూనివర్సల్ బాస్ ఈజ్ బ్యాక్' అంటూ గేల్ ఐపీఎల్ -11 సీజన్ లో ఘనంగా తొలిసారి కింగ్స్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగి మెరుపు వేగంతో ఆడాడు. ఈ సీజన్ లో బెంగుళూరు వదులుకున్న గేల్ ను కనీస ధర రూ.2 కోట్లు పెట్టి కింగ్స్ X1పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వరుస సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఏడాదికి పైగా ఫామ్లో లేని గేల్ను చెన్నై మ్యాచ్లోనే ఆడించడానికి ఓ కారణం ఉందని పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అంటే క్రిస్గేల్ ఇష్టపడటమే కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. "వారి బౌలింగ్ ఎటాక్ అంటే గేల్కు ఇష్టం. ఈ రోజు తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఇదో చక్కని అవకాశం అని నాకనిపించింది. ప్రత్యర్థి బౌలింగ్ సైతం అనుకూలంగా ఉండటం కలిసొచ్చింది. మా వ్యూహం చక్కగా పనిచేసింది" అని అశ్విన్ అన్నాడు. బలమైన జట్టుగా ఉన్న పంజాబ్ ఇంతావరకు ఐపీఎల్ ట్రోఫీ ను ముద్దాడలేదు. ఈ సారి అశ్విన్ నేతృత్వంలో కప్ సాధించాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది.