ఉన్నావ్ కేసులో మరొకరి అరెస్ట్

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 07:01 PM

ఉన్నావ్ కేసులో మరొకరి అరెస్ట్

లక్నో, ఏప్రిల్ 17 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ మంగళవారం మరో వ్యక్తిపై కేసు నమోదు చేసింది. అత్యాచార బాధితురాలిని ఘటనా స్థలానికి చేర్చడంలో శుభం సింగ్‌ ప్రమేయం కూడా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. విచారణ నిమిత్తం మంగళవారం శుభం సింగ్‌ను అరెస్టు చేసింది. శశి సింగ్‌ బాధిత యువతిని ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ నివాసానికి తీసుకెళ్లిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె కుమారుడు శుభం సింగ్‌కు ఈ ఘటనతో సంబంధం ఉందని సీబీఐ అభియోగాలు మోపింది.

"ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ ఇంటికి శశి సింగ్‌ నా కూతురుని తీసుకెళ్లింది. ఎమ్మెల్యే అఘాయిత్యం చేస్తున్న సమయంలో శశి గేటు కాపలాగా ఉంది" అని అత్యాచార బాధిత యువతి తల్లి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. బాధిత యువతి మైనర్‌ కాదనే గందరగోళం తలెత్తడంతో మరోసారి ఆమె వయసు నిర్ధారణకు యువతిని శనివారం లక్నోలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.





Untitled Document
Advertisements