హైదరాబాద్, ఏప్రిల్ 18 : అమీర్పేట-పంజాగుట్ట మార్గంలో 43రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారు. భూగర్భ విద్యుత్తు కేబుల్ పనుల దృష్ట్యా ఈ ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బస్సులు, కార్లు, భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఈ మార్గాలలో ప్రయాణించకూడదని ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు. అయితే ఈనెల 19 నుండి మే 31 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
* సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నుంచి పంజాగుట్ట, ఎంజీబీఎస్ వైపు వచ్చే వాహనాలు.. కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా నర్సాపూర్ క్రాస్రోడ్స్-బాలానగర్-ఫిరోజ్గూడ- బోయిన్పల్లి జంక్షన్-బాలంరాయి జంక్షన్- సీటీవో- ప్యారడైజ్ జంక్షన్ మీదుగా ఎంజీరోడ్, అప్పర్ ట్యాంక్బండ్, రవీంద్ర భారతి మీదుగా వెళ్లాలి.
* పటాన్ చెరు, మియాపూర్, కూకట్పల్లి మీదుగా కోస్తాంధ్ర, రాయలసీమకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్ బస్సులు మైత్రీవనం నుంచి గౌతమ్ డిగ్రీ కళాశాల వైపు నుండి కూకట్పల్లి మీదుగా వెళ్లాలి.
* కృష్ణానగర్ నుంచి ఖైరతాబాద్వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు శ్రీనగర్ కాలనీ, జీహెచ్ఎంసీ పార్కు మీదుగా ఎం.జె.కాలేజ్ నుంచి నాగార్జున సర్కిల్, జీవీకే ఒన్, తాజ్ కృష్ణా, కేసీపీ జంక్షన్ నుంచి ఖైరతాబాద్కు రావాలి.