అగర్తలా, ఏప్రిల్ 18: కురుక్షేత్రంలో జరిగిన 18 రోజుల యుద్ధం గురించి సంజయ్ అనే వ్యక్తి ధృతరాష్ట్రుడికి ఇంటర్నెట్ ద్వారానే సమాచారం అందించారని వింత వ్యాఖ్యలు చేశారు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయివుండి ఆయన ఇలాంటి వింత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంటర్నెట్ అనేది కొత్తగా సృష్టించిన సాంకేతికత కాదని మహాభారతం సమయం నుంచే ఇంటర్నెట్ ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా వేలాది సంవత్సరాల క్రితం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ను ఎన్ఐసీ (జాతీయ సమాచారం కేంద్రం) వినియోగించుకుంటోందని పేర్కొన్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలోని ప్రజ్ఞా భవన్లో కంప్యూటరైజేషన్పై వర్క్షాప్ కార్యక్రమానికి బిప్లబ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మహాభారతం సమయం నుంచే దేశంలో ఇంటర్నెట్ సేవలు, శాటిలైట్లు అందుబాటులో ఉండేవి. అలా వేలాది సంవత్సరాల క్రితం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ను ఎన్ఐసీ(జాతీయ సమాచారం కేంద్రం) కేంద్రం వాడుకుంటుంది. టెక్నాలజీని తామే కనిపెట్టామని యూరోపా దేశాలు చెప్పుకుంటాయి. కానీ నిజానికి ఆ టెక్నాలజీ మనది. అంతేకాదు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాకే యావత్ భారతదేశం టెక్నాలజీకి మరింత దగ్గరైంది. మన ప్రధాని సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. అలాంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం" అని వ్యాఖ్యానించారు. కాగా, విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్మీడియాలో నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు.