భువనేశ్వర్, ఏప్రిల్ 18: ప్లాస్టిక్.. పర్యావరణానికి చేస్తున్న హాని చెప్పలేనిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లో అయితే ప్రయాణికులు తాగేసి స్టేషన్ ఆవరణలోనే పడేస్తారు. అలా చేయకుండా ఉండేందుకు భువనేశ్వర్ రైల్వేస్టేషన్లో ఓ వినూత్న కార్యక్రమానికి రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ యంత్రాల్లో వేస్తే మీ ఫోనుకు రూ.10 బ్యాలెన్స్ కలుస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్లాట్ఫారాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టామని వారు పేర్కొంటున్నారు. తొలి విడతలో భువనేశ్వర్లో ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని స్టేషన్లకు దీన్ని విస్తరిస్తామని అధికారులు వెల్లడించారు.
ఒకటి, ఆరో నెంబరు ప్లాట్ఫారాలపై ఇందుకోసం రెండు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల రీసైక్లింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఖాళీ బాటిల్ను యంత్రంలో పడవేసి యంత్రానికున్న కీపాడ్పై తన సెల్ ఫోన్ నెంబరు నొక్కితే 20 సెకన్లలో చరవాణికి రూ.10 టాక్టైమ్ వస్తుంది అన్నారు. 200 మిల్లీలీటర్ల నుంచి రెండు లీటర్ల సామర్థ్యం గల ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఈ యంత్రంలో వేయవచ్చని అధికారులు తెలిపారు.