లండన్, ఏప్రిల్ 18 : మూడు దేశాలు ( యూకే, స్వీడన్, జర్మనీ) భాగంగా బ్రిటన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధానమంత్రి థెరీసా మేతో భేటీ అయ్యారు. బుధవారం ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రి థెరేసా మేతో చర్చలు జరిపారు. థెరెసాతో ఆయన మాట్లాడుతూ నేటి సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలకు నూతన జవసత్వాలు జతకూడుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిలో బ్రిటన్ భాగస్వామి అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల వాతావరణ మార్పులతో పోరాడటం మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలవారి పట్ల మన బాధ్యతను నిర్వహించినట్లవుతుందన్నారు.
12వ శతాబ్దం నాటి సాంఘిక సంస్కర్త బసవేశ్వరుని జయంత్యుత్సవాల సందర్భంగా లండన్లో ప్రవాస భారతీయులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. థెరెసా మే మాట్లాడుతూ భారతదేశం, బ్రిటన్ ప్రజల కోసం మనం కలిసి పని చేయగలమని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.