హైదరాబాద్, ఏప్రిల్ 19 : గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో రగులుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. మొదట్లో నటి శ్రీరెడ్డి ఈ వివాదం గురించి మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు తర్వాత 'మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తనకు కార్డు ఇవ్వలేదని ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ ఉదంతం గురించి చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో విద్యార్ధి సంఘాలు, మహిళా సంఘాలు శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచి ఉద్యమించారు. మొన్న శ్రీరెడ్డి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో ఈ ఉద్యమం కాస్త పక్కదారి పట్టింది. శ్రీరెడ్డి ఇలా తిట్టడం పద్దతి కాదని ప్రతీఒక్కరూ ఆమె పై మండిపడ్డారు.
అయితే ఇప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొక విషయాన్ని బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగమని చెప్పింది తానేనని వర్మ అంగీకరించాడు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఉద్యమం ప్రజల్లోకి వేగంగా చేరుతుందన్న ఉద్దేశంతోనే ఆ సలహా ఇచ్చానన్నాడు. దీనిపై వర్మ ఇచ్చిన వివరణ ఇలా ఉంది.. “ఈ విషయంలో పూర్తి బాధ్యత నాదే. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్ సభాముఖంగా తిట్టుకున్నాగానీ, ఈ మధ్య వారిద్దరూ కలిసి భోజనం చేయడం మనం చూశాం. రాజకీయ నాయకులు చేసిన పనినే నేనూ చేశాను. పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ద్వారానే కత్తి మహేష్ అనే వ్యక్తి పాపులర్ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి. ఆయనను విమర్శిస్తే ప్రజల దృష్టి ఉద్యమం వైపు మళ్లుతుంది. ఈ వివాదంలోకి పవన్ ను లాగినందుకు పవన్కు, అతడి అభిమానులకు నా క్షమాపణలు” అని ఒక వీడియోని యూట్యూబ్లో వర్మ పోస్ట్ చేశాడు. మరి దీనిపై సినిమా పెద్దలు ఎలా స్పందిస్తారో.? ఈ కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయో.? వేచి చూడాలి.