న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : సోహ్రబుద్దిన్ ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించిన మృతిపై సుప్రీం ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సీబీఐ ( కేంద్ర దర్యాప్తు సంస్థ) ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా.."రిట్ పిటిషన్లలో లోయా మరణంపై సిట్ విచారణ ఎందుకు జరిపించాలో సరైన వివరణ లేదని, లోయా సహజంగానే మరణించారు" అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
స్వలాభం కోసం దురుద్దేశంతోనే ఈ పిటిషన్లను దాఖలు చేశారని దీపక్ మిశ్రా, డీవై చంద్రచూడ్, ఖన్విల్కర్ల ధర్మాసనం మండిపడింది. 2014 డిసెంబర్లో జస్టిస్ లోయా మరణించారు. అప్పటికి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) న్యాయస్థానంలో సొహ్రబుద్దీన్ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. లోయా మృతిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తులు భూషణ్ గవాయ్, సునీల్ షుక్రేలు ఆయనది సహజమరణమేనని తీర్పును వెలువరిచారు.