ముంబై, ఏప్రిల్ 19 : సినిమా ప్రేమికులు ఎప్పుడూ కొత్తదనాన్నే కోరుకుంటారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి మేరకు దర్శకులు, హీరోలు తమ పంథాని ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తదనాన్ని అందించే విషయంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. షారుఖ్ కథానాయకుడుగా త్వరలో రాబోతున్న చిత్రం 'జీరో'.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ 'మరగుజ్జు'గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథానాయికలుగా అనుష్క శర్మ, కత్రినాకైఫ్ లు నటిస్తున్నారు. ఇందులో కత్రినా సూపర్స్టార్ పాత్ర పోషిస్తుండగా, అనుష్క మానసిక దివ్యాంగురాలుగా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధి౦చిన కొన్ని కీలక సన్నివేశాలను అమెరికాలోని అలాబమాలో ఉన్న అంతరిక్ష, రాకెట్ కేంద్రంలో తెరకెక్కించనున్నారు. చిత్రీకరణ అనుమతుల కోసం ముంబైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో చర్చించారు. అంతరిక్ష కేంద్రంలో చిత్రించడానికి అమెరికా కాన్సులేట్ అధికారులు ఒప్పుకోవడంతో, అమెరికా వెళ్ళడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్న్స్' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు ప్రయోగాత్మకమైన పాత్రలు చేస్తుండటంతో సినీ అభిమానుల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 21న 'జీరో' ప్రేక్షకుల ముందుకు రానుంది.