ఆ సమయంలో ఎంతో భయమేసింది : మహేష్

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 03:37 PM

ఆ సమయంలో ఎంతో భయమేసింది : మహేష్

హైదరాబాద్, ఏప్రిల్ 19 : ఎంతో ప్రశాంతంగా, ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళకుండా, రాజకీయాల గురించి అస్సలు మాట్లాడకుండా ఉండే ఇప్పటి తెలుగు స్టార్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. మహేష్ కి మొదటి నుంచి సినిమా తప్ప మరో వ్యాపకం లేదు అంటుంటారు. అలాంటి హీరో సినిమా, రాజకీయాల నేపధ్యంలో వస్తుంద౦టే ఆ సినిమాపై ఊహాగానాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'భరత్ అనే నేను' ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మహేష్.. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడారు.

“సంవత్సరం క్రితం కొరటాల శివ ఈ కథ చెప్పినప్పుడు మొదట ఎంతో ఉత్సాహంగా అనిపించింది. అదే సమయంలో చాలా భయం కూడా వేసింది. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నేను సంవత్సరం పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా చూశాక ప్రతీ నాయకుడు, ప్రతీ పొలిటికల్ పార్టీ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుందని భావిస్తున్నాను” అని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇన్ని అంచనాల నడుమ విడులవుతున్న ఈ చిత్రం ఎంతవరకు అంచనాలు నిలబెట్టుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.





Untitled Document
Advertisements