జైపూర్, ఏప్రిల్ 19 : ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ రాణా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. వరుసుగా రెండు మ్యాచ్ ల్లో అద్భుతంగా రాణించిన అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇందుకుగాను అతడు ఈ సీజన్లో ఇంతగా రాణించడానికి వెనుక ఓ కారణం ఉందని వెల్లడించాడు.
నిన్న రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన రాణా ఓపెనర్లు రహానె, షార్ట్ను పెవిలియన్కు పంపాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాణా 35 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం రాణా మాట్లాడుతూ.."నాకు భారత్ తరఫున ఆడాలన్న బలమైన ఆశ ఉంది. అందుకే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నా. కోల్కతా వరుసగా గెలిచిన రెండు మ్యాచుల్లో నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాను. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ నుంచి పరుగులను కట్టడి చేయడమే నా బాధ్యత. అందుకే లయ తప్పకుండా బౌలింగ్ చేశాను" అని రాణా వ్యాఖ్యానించాడు.