బెంగళూరు, ఏప్రిల్ 19: కర్ణాటక ఎన్నికల సమరంకు బీజేపీ పార్టీ కాంగ్రెస్ ను గద్దెదించాలని భావిస్తుంది. అంతే కాకుండా హస్తం పార్టీకి మిగిలిన ఈ ఒక్క పెద్దరాష్ట్రం ను దూరం చేసి దక్షిణాదిన బలపడాలని చూస్తుంది. తాజాగా బెంగళూరు పర్యటనలో భాగంగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా బెంగళూరు శివారులోని హొస్కోటెలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోనుందన్నారు. కర్ణాటకలో అనుకున్న లక్ష్యం దిశగా 150 స్థానాలు గెలుపొందుతామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే చరిత్ర పరిశోధకులు చిదానందమూర్తి, సీనియర్ సాహితీవేత్త సిద్దలింగయ్య నివాసాలకు వెళ్ళి చర్చలు జరిపారు. విజయనగర్లోని చిదానందమూర్తి ఇంటికి వెళ్ళి అరగంటకుపైగా చర్చలు జరిపారు. ఇదే సందర్భంలో చిదానందమూర్తి పలు సలహాలు, సూచనలును ఇచ్చారు. వీటిలో ముఖ్యంగా లింగాయత ప్రత్యేకమతం అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని, వీరశైవ లింగాయతులు ఒక్కరేనని, కావేరీ అంశంలో కన్నడిగులకు అన్యాయం జరుగకుండా చూడాలని, సరిహద్దులో మహారాష్ట్ర చేస్తున్న ఇబ్బందిని అరికట్టాలని, దేశాన్ని ఇండియా కాకుండా భారత్ అని పిలిచేలా రాజ్యాంగ సవరణ చేయాలని తెలిపినట్లు సమాచారం.