హైదరాబాద్, ఏప్రిల్ 19 : వెళ్లవయ్యా. .వెళ్ళు.. వెళ్ళూ... అంటూ దాదాపు పదహారేళ్ళ క్రితం 'జయం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది సదా. 'జయం' తర్వాత మూడునాలుగు ఏళ్ళు సినిమా అవకాశాలు బాగానే వచ్చినా చెప్పుకోదగ్గ సక్సెస్ రాకపోవడంతో తెలుగునాట మెల్లగా తెరమరుగైంది. అయితే తమిళ సినిమాల్లో అజిత్, విక్రమ్, మాధవన్ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆకట్టుంది సదా.
ప్రస్తుతం సదా నటిస్తున్న సినిమా 'టార్చ్ లైట్'. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బైటకి వచ్చింది. ఆ విషయం ఏంటంటే..! వేశ్య జీవితానికి సంబంధించిన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందట. అందువలన ఈ సినిమా చేయడానికి చాలామంది కథానాయికలు ముందుకు రాలేదు. అప్పుడు 'సదా' ధైర్యంగా ముందుకు వచ్చిందట. ఈ చిత్రానికి నిర్మాతగా సదానే వ్యవహరిస్తుందట. ఈ చిత్రానికి మజీద్ దర్సకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని తెరకెక్కించారు.