న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి లండన్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు 'లిక్కర్ కింగ్' విజయ్ మాల్యా. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బ్రిటన్లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాన మంత్రి థెరేసా మేతో చర్చల సందర్భంగా విజయ్ మాల్యా గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన వివాదాల్లో ఇరు దేశాలు సహకరించుకోవడంపై వీరిద్దరూ చర్చించినట్లు బ్రిటన్ పీఎం అధికార ప్రతినిథి ఒకరు చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.
విజయ్ మాల్యా మనీలాండరింగ్ చేసినట్లు, బ్యాంకులను మోసగించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం లండన్లో ఉన్న ఆయనను భారతదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2017లో ఆయనను లండన్ పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. అయితే వెంట వెంటనే మాల్యా బెయిలు పై బయటకు వచ్చారు.