హైదరాబాద్, ఏప్రిల్ 20 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తనపై వస్తున్న విమర్శలకు ఫిలింఛాంబర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పవన్ ఫిలింఛాంబర్ చేరుకొని "తన తల్లిపై దుర్భాషలాడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని "మా"(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)ను, నిర్మాతల మండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి శ్రీరెడ్డి తన తల్లిని దూషించడం వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నారని తానే ఒప్పుకోవడంతో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చలు జరిపారు.
ఇదిలా ఉండగా నిర్మాత అల్లు అరవింద్ న్యాయపరంగా రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై న్యాయవాదులతో చర్చించారు. ఫిలింఛాంబర్ వద్దకు పవన్ తో పాటు నాగబాబు, అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. తనకు న్యాయం జరిగే వరకు ఈ ఫిలింఛాంబర్ ను వదిలి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు.