పుణె, ఏప్రిల్ 20 : ఐపీఎల్ జట్టులలో అన్ని జట్ల కంటే ధోని జట్టు ప్రత్యేకం.. ఎందుకంటే అక్కడి అభిమానులు చెన్నైకు ఇచ్చే మద్దతు అలాంటింది. కానీ ఈ సారి కావేరి నది జలాల నేపధ్యంలో అక్కడ జరగాల్సిన ఐపీఎల్-11 మ్యాచ్ లు పుణె కు తరలించారు. అయినప్పటికీ అభిమానుల కోసం ఆ జట్టు ఫ్రాంఛైజీ.. రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేక రైలు వేయించి సుమారు పది వేల మంది అభిమానుల్ని మ్యాచ్ కోసం రప్పించింది. గురువారం ఉదయం చెన్నైలో బయలుదేరిన ఈ రైలు శుక్రవారం పుణె చేరుకుంది. దీనికి అభిమానులు 'విజిల్పోడు ఎక్స్ప్రెస్' అని పేరు కూడా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.."అభిమానులు లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ లేదు. వారికి మేము ఎంత చేసినా తక్కువే. కొన్ని కారణాల వల్ల చెన్నై ఈ ఏడాది సొంతగడ్డపై ఆడే మ్యాచ్లన్నింటినీ పుణె తరలించాం. ఈ నేపథ్యంలో మా అభిమానుల కోసం ఏమైనా చేయాలనుకున్నాం. అందుకే వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి అభిమానులు పుణెలో మ్యాచ్ తిలకించేందుకు ఏర్పాట్లు చేశాం. అంతేకాదు వారి ప్రయాణ, భోజన, వసతి ఖర్చులను కూడా మేమే భరిస్తున్నాం. కనీసం వెయ్యి మందైనా వస్తారా అని ముందు అనుకున్నాం. కానీ, చెన్నై అభిమానులు మేము ఊహించని రీతిలో మాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారు. " అని కాశీ వ్యాఖ్యానించారు.