హైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిశారు. మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం, మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, బాలకృష్ణపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. బాలకృష్ణను అరెస్ట్ చేయాలని తాము క్రిమినల్ కంప్లైంట్స్ దాఖలు చేసిన విషయాన్నీఆయనకు చెప్పామని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.