పట్నా, ఏప్రిల్ 22: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా(80) ఆ పార్టీకు రాజీనామా చేశారు. అంతే కాకుండా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇకపై పనిచేస్తానని ఆయన వెల్లడించారు. బీజేపీకి చెందిన మరో తిరుగుబాటు ఎంపీ శత్రుఘ్న సిన్హాతో కలిసి శనివారం పట్నాలో జరిగిన 'రాష్ట్రీయమంచ్' కార్యక్రమంలో మాట్లాడారు.
మహారాష్ట్రలో రైతుల ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం అన్నదాతలను అడుక్కునే స్థాయికి దిగజార్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మొదట్నుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్న యశ్వంత్ సిన్హా.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు జనవరిలో రాష్ట్రీయమంచ్ పేరిట రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు.
వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హా విధులు నిర్వహించారు. ఆయన కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.