హైదరాబాద్, ఏప్రిల్ 22 : "భరత్ అనే నేను" సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు.. మీరంతా గర్వపడేలా చేస్తానంటూ మాటిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ ప్రముఖులు సైతం సినిమా అద్భుతం అంటూ కితాబిచ్చారు.
ఈ నేపథ్యంలో మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో.. ఇది ఆశీర్వాదంగా భావిస్తున్నా. మీరు గర్వపడేలా చేస్తానని నేను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నా. "భరత్ అనే నేను"ను నాకిచ్చినందుకు ధన్యవాదాలు దర్శకుడు కొరటాల శివ సర్. ఈ సినిమా విజయం మా అందరి విక్టరీ. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. 'భరత్ అనే నేను' పై మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రంలో కథానాయికగా కైరా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.