హైదరాబాద్, ఏప్రిల్ 22: 2011లో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, 2011 ఫిబ్రవరి 20న ఇందిరాపార్క్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న తనపై కొందరు నేతలు దాడి చేసి, కులం పేరుతో దూషించారని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎన్.వెంకటస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తాను దీక్ష చేస్తున్న సమయంలోనే జగన్ దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారని... వారి దీక్ష కోసం తన టెంట్ ను తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, వెంకటస్వామి టెంట్ ను తొలగించడానికి జగన్, అంబటి రాంబాబులు కారణం కాదని విచారణలో తేలడంతో కేసును హైకోర్టు కొట్టేసింది.