హైదరాబాద్: ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాలపై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రోజున ఇంటర్ ఫలితాలలో జరిగిన అక్రమాలకు నిరసనగా దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ అరెస్ట్కు నిరసనగా మంగళవారం రోజున ఆ పార్టీ నేతలు ట్యాంక్బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళన చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ధర్నా చేసేందుకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.