రోజూ ఉరుకులు పరుగుల జీవితం గడిపే హైదరాబాద్ నగర వాసులకు ఓ చక్కటి శుభవార్త. 6 కొత్త ఎంఎంటిఎస్ ట్రైన్స్ ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో ఒక్కో దానిలో 12 బోగీలు ఉంటాయి. అలాగే ప్రస్తుతం 9 బోగీలతో నడుస్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్స్ లో కూడా ఉదయం, సాయంత్రం రద్దీ వేళలలో ఒక్కో ట్రైన్ కు అదనంగా మూడేసి బోగీలు జత చేసి నడిపించబోతున్నారు. మిగిలిన సమయంలో యధాప్రకారం 9 బోగీలతో ఎంఎంటిఎస్ ట్రైన్స్ నడిపించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పాత బోగీలతో పోలిస్తే కొత్తగా ఏర్పాటు చేస్తున్న బోగీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.
ప్రస్తుతం హైదరాబాద్ జంటనగరాలలో లింగంపల్లి-నాంపల్లి, లింగంపల్లి-సికిందరాబాద్, లింగంపల్లి-ఫలక్నుమా, నాంపల్లి-ఫలక్నుమా మద్య రోజుకు 121ఎంఎంటిఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. వాటిలో రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
సాంకేతిక కారణాల వలన పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లను నడిపించడం సాధ్యం కానప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు చేసి నేటి నుంచి కొత్తగా 6 సర్వీసులను ప్రారంభిస్తున్నారు. కనుక ఎంఎంటిఎస్ ట్రైన్స్ లో ప్రయాణించేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగవచ్చని అధికారులు భావిస్తున్నారు.